Edible Oil: వంటనూనె ధరలను పెంచవద్దని కంపెనీలను కోరిన ప్రభుత్వం

By Margam

Published on:

Follow Us
Edible Oil: వంటనూనె ధరలను పెంచవద్దని కంపెనీలను కోరిన ప్రభుత్వం


Telegram Channel Join Now

దిశ, బిజినెస్ బ్యూరో: తక్కువ సుంకంతో సరఫరా చేసిన వంట నూనెల నిల్వలు తగినంత ఉన్నందున, రిటైల్ ధరలను పెంచవద్దని వంటనూనె కంపెనీలను ప్రభుత్వం కోరింది. ఇటీవల కేంద్రం వంటనూనెలపై దిగుమతి సుంకాలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటైల్ ధరలను పెంచకుండా ఆయిల్ కంపెనీలకు సూచించింది. మంగళవారం ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా అధ్యక్షతన సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ), ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐవీపీఏ), సోయాబీన్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎస్ఓపీఏ) ప్రతినిధులతో ధరల గురించి చర్చించారు. అనంతరం, తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకున్న స్టాక్‌లు 45-50 రోజుల పాటు సరిపడా దాదాపు 30 లక్షల టన్నులు ఉన్నాయని, అందువల్ల ఆయిల్ ప్రాసెసర్లు గరిష్ట రిటైల్ ధరలను (ఎంఆర్‌పీ) పెంచడం మానుకోవాలని ఆహార మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో పేర్కొంది. దేశీయ రైతులకు మద్దతుగా వివిధ వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ పెంచుతూ కేంద్రం గత వారం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 14 నుంచి ముడి సోయాబీన్ ఆయిల్, క్రూడ్ పామాయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం సున్నా నుంచి 20 శాతానికి పెంచింది. తద్వారా ముడి నూనెలపై సుంకం 27.5 శాతానికి పెరిగింది. అదనంగా, రిఫైన్డ్ పామాయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 12.5 శాతం నుంచి 32.5 శాతానికి పెంచారు, తద్వారా రిఫైన్డ్ ఆయిల్‌లపై ఎఫెక్టివ్ డ్యూటీ 35.75 శాతానికి పెరిగింది.



Source link

Leave a Comment